తెలుగు వారిని అవమానించలేదు.. నటి కస్తూరి వివరణ

  • తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపణ
  • తనపై నెగెటివిటీ తెచ్చేందుకు డీఎంకే పార్టీ కుట్ర
  • ‘తెలుగు నా మెట్టిల్లు, తెలుగువారంతా నా కుటుంబం’ అంటూ ట్వీట్
తెలుగు వారిని తాను అవమానించానంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని నటి కస్తూరి వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తప్పుడు అర్థాలు తీస్తూ తనపై వ్యతిరేకత తీసుకొచ్చేందుకు డీఎంకే పార్టీ చేసిన కుట్ర అని ఆరోపించారు. తెలుగు తన మెట్టిల్లు అని, తెలుగు వారంతా తన కుటుంబ సభ్యులని కస్తూరి పేర్కొన్నారు. ఈ విషయం తెలియని కొంతమంది మూర్ఖులు తనపై తెలుగు ప్రజలకు ద్వేషం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

ఈమేరకు సోమవారం కస్తూరి వరుస ట్వీట్లతో వివరణ ఇచ్చారు. తాను తెలుగు వారిని, తెలుగు జాతిని అవమానించలేదని ఆమె స్పష్టం చేశారు. ‘నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపించే తెలుగు వారు ఈ తప్పుడు ప్రచారం నమ్మవద్దని కోరుతున్నా’ అంటూ కస్తూరి ట్వీట్ చేశారు.

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు వారిని ఉద్దేశించి కస్తూరి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో నటి కస్తూరి స్పందించారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, డీఎంకే నేతలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించారు.

Actress Kasturi
Telugu People
Tamil
DMK
BJP
Twitter

More Telugu News